వాళ్లు మనుషులేనా? జీవించే హక్కు లేదు! భగ్గుమన్న తారాలోకం
on Jun 4, 2020
కేరళలోని మలప్పురం జిల్లాలోని ఓ గ్రామంలోకి గర్భంతో ఉన్న ఏనుగు వచ్చి ఆకలి తీర్చుకోవాలని ప్రయత్నించగా, ఆకతాయిలు బాణాసంచా కూర్చిన పైనాపిల్ ఇవ్వడంతో అది నోట్లో పేలి ఏనుగు మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ ఘటనపై తారాలోకం భగ్గుమంది. ముఖ్యంగా ఈ ఘటనకు కారణమైనవాళ్లను శిక్షించాలని కథానాయికలు కోరారు.
‘‘జంతు హింసకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు, శిక్షలు రావాల్సిన అవసరం ఉంది’’
– హిందీ హీరోయిన్ అనుష్కా శర్మ
‘‘ఇది అత్యంత దారుణమై, అమానుష చర్య’’
– కాజల్ అగర్వాల్
‘‘ఏనుగు ఆకలితో ఉంది. పైగా, గర్భవతి. గ్రామంలో ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని వచ్చింది. కానీ, మనుషులు ఎంత క్రూరులో తెలుసుకోలేకపోయింది’’
– లక్ష్మీ మంచు
‘‘ఈ దారుణానికి పాల్పడినవాళ్లకు జీవించే హక్కు లేదు’’
– పూజా రామచంద్రన్
‘‘మానవత్వం మరణించింది’’
– రాశీ ఖన్నా
‘‘గర్భవతి అయిన మహిళను హత్య చేసిన దోషులకు ఏ విధమైన శిక్ష పడుతుంతో, ఈ దారుణం చేసిన వాళ్లకూ అదే శిక్ష పడుతుందని ఆశిస్తున్నా’’
– ఉపాసనా కొణిదెల
‘‘ఏదో ఒక రోజు మనుషులు నాగరికులుగా, మంచిగా మారతారని ఆశిస్తున్నా’’
– రేణూ దేశాయ్
‘‘మానవత్వం మంటకలిసిపోతోంది. ఈ ఘటన చూశాక హృదయం ద్రవించింది. కఠిన శిక్షలు విధించాలని కోరుకుంటున్నా’’
– రకుల్ ప్రీత్ సింగ్
ఇంకా పలువురు కథానాయికలు, హీరోలు, సినీ ప్రముఖులు ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.